నోబెల్ బహుమతి - 2017 విజేతలు

      వైద్యశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు.. సాహిత్య రంగంలో రచయితలకు.. ప్రపంచ శాంతి కోసం పాటుపడిన వ్యక్తులకు ఏటా నోబెల్ బహుమతులు అందజేస్తారు.
        మొదటి ఐదు రంగాల విజేతలను స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది. శాంతి బహుమతిని నార్వే ప్రకటిస్తుంది. డైనమైట్‌ను కనుగొన్న ప్రముఖ స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ఈ అవార్డులను ఇస్తున్నారు. ఈ మేరకు 2017 సంవత్సరానికి గాను వైద్యశాస్త్రంలో జెఫ్రీ సి.హాల్, మైకేల్ రోస్‌బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్‌లను నోబెల్ బహుమతి వరించింది. రసాయన శాస్త్రంలో జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించారు. భౌతికశాస్త్రంలో రైనర్ వీస్, కిప్ థోర్న్, బారీ బారిష్‌లు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. నోబెల్ సాహిత్య పురస్కారానికి కజువో ఇషిగురో.. నోబెల్ శాంతి బహుమతికి ‘ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్‌‌స-ఐ కెన్’ సంస్థ.. ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డుకి ప్రముఖ ఎకనమిస్ట్ రిచర్డ్ థేలర్ ఎంపికయ్యారు.

జీవగడియారానికి వైద్యశాస్త్రంలో నోబెల్
         వెద్య శాస్త్రంలో విశేష సేవలందిస్తున్న అమెరికాకు చెందిన ముగ్గురు జన్యు శాస్త్రవేత్తలు జెఫ్రీ సి.హాల్, మైకేల్ రోస్‌బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్‌లు వైద్య రంగంలో నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. మానవుడు, జంతువులతోపాటు ఇతర జీవుల్లో నిద్రపోయే, మేల్కొనే సమయాలను నియంత్రించే జీవగడియారం (సిర్కాడియమ్ రిథమ్) రహస్యాన్ని శోధించినందుకు గాను వీరిని నోబెల్ పురస్కారం వరించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు 1.1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7 కోట్లు) ప్రైజ్‌మనీని సంయుక్తంగా పంచుకోనున్నారు.
భూమిపై నివసించే ప్రతి జీవి భూపరిభ్రమణానికి అనుగుణంగా జీవిస్తుందని గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే జీవుల్లో రోజువారీ క్రియలైన నిద్ర, ఆహార అలవాట్లు, హార్మోన్‌‌స విడుదల, శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించే సిర్కాడియమ్ క్లాక్ పనితీరును శరీరంలోని కణాలు ఏ విధంగా తమ అధీనంలో ఉంచుకుంటాయో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. అలాగే మానవులు, జంతువులు, మొక్కలు జీవన గమనం (బయోలాజికల్ రిథమ్)కు ఇమిడిపోయే విధానాన్ని వివరించారు. సిర్కాడియమ్ క్లాక్ సరిగ్గా పనిచేయని సందర్భాల్లో ఒత్తిడి, బైపోలార్ డిజార్డర్‌లతోపాటు కొన్ని రకాల నాడీ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు. షిఫ్ట్‌ల వారీగా ఉద్యోగం చేసేవారిలో రోజువారీ జీవక్రియలు, సిర్కాడియమ్ క్లాక్ మధ్య వ్యత్యాసం ఏర్పడి ప్రాణాంతక వ్యాధులైన కేన్సర్, జీవక్రియ రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు తేలింది. మొత్తంగా బయటి వాతావరణానికి, జీవ గడియారం మధ్య ఏర్పడే వ్యత్యాసం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదమున్నట్లు తెలిపారు.

గురుత్వతరంగాలను గుర్తించినందుకు నోబెల్
       గురుత్వతరంగాల ఉనికిని గుర్తించినందుకుగాను అమెరికాకు చెందిన ముగ్గురు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలైన రైనర్ వీస్, కిప్ థోర్న్, బారీ బారిష్‌లను నోబెల్ అవార్డు- 2017 వరించింది. తన సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ఈ గురుత్వ తరంగాల గురించి వందేళ్ల కిందటే ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించారు. కృష్ణ బిలాలు ఒకదానికి మరొకటి ఢీకొనడం వంటి పరిణామాలు జరగడం వల్ల ఇవి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015లోనే వీటిని తొలిసారిగా గుర్తించినప్పటికీ 2016 ఫిబ్రవరిలో ప్రకటించారు. వీటిని గుర్తించేందుకు యూఎస్‌లోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)ను థోర్న్, వీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత బారిష్ ఈ ప్రాజెక్టుకు తుది రూపునిచ్చారు. దాదాపు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏర్పడ్డ గురుత్వ తరంగాలను వీరు తొలిసారిగా ప్రత్యక్షంగా గుర్తించగలిగారు.
        ఈ అంతు చిక్కని తరంగాలను 2015 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు గుర్తించగలిగారు. రెండు సార్లు ‘లిగో’ ను, ఇంకోసారి ఇటలీలో యురోపియన్ గ్రావి టేషనల్ అబ్జర్వేటరీ (విర్గో)ను ఉపయోగించారు. కృష్ణ బిలాలు ఎటువంటి కాంతినీ వెదజల్లవు. వీటిని కేవలం గురుత్వ తరంగాల ఆధారంగానే గుర్తించే వీలు కలుగుతుంది.

అణువుల అధ్యయనానికి కెమిస్ట్రీ నోబెల్
        అతి సూక్ష్మమైన అణువులను ఫొటోలు తీసే కొత్త పద్ధతిని కనుగొన్నందుకు గాను జాక్వెస్ డుబోషే(స్విట్జర్లాండ్), జోయాకిమ్ ఫ్రాంక్(జర్మనీ), రిచర్డ్ హెండర్సన్(స్కాట్‌లాండ్)కు రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు దక్కింది. వీరు ఎలక్ట్రాన్ కిరణాలతో అణువుల మెరుగైన ఫొటోలు తీసేందుకు ‘క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ’ అనే పద్ధతిని కనుగొన్నారు. దీంతో ఎంతో సులువుగా జీవ అణువుల త్రీడీ చిత్రాలను తీయవచ్చు. తద్వారా సూక్ష్మమైన కణ నిర్మాణాలను, వైరస్‌లను, ప్రొటీన్లను అధ్యయనం చేయొచ్చు. ఇటీవల బ్రెజిల్‌లో సంచలనం సృష్టించిన జికా వైరస్‌ను ప్రపంచానికి చూపించేందుకు, అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో సంబంధం ఉన్న ఎంజైమ్‌ను గుర్తించేందుకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ విధానాన్నే ఉపయోగించారు.

కజువో ఇషిగురోకు సాహిత్య నోబెల్
        బ్రిటన్ నవలా రచయిత కజువో ఇషిగురో ‘The Remains of the Day’ నవలకు గాను నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నవలకు 1989లో మాన్ బుకర్ ప్రైజ్ కూడా లభించింది. ఇషిగురోకు ప్రైజ్‌మనీకి కింద 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) అందజేస్తారు. నోబెల్ సాహిత్య పురస్కారం పొందిన 114వ రచయిత ఇషిగురో.
        రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాగసాకీలో పరిస్థితులపై ఇషిగురో 1982లో ‘ద పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ (తొలి నవల), 1986లో ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫ్లోటింగ్ వరల్డ్’ అనే నవలను రచించారు. 2005లో ‘నెవర్ లెట్ మీ గో’అనే సైన్‌‌స ఫిక్షన్, 2015లో ద బరీడ్ జెయింట్ ను రచించారు.

ఆర్థికశాస్త్రంలో థేలర్‌కు నోబెల్
        ఆర్థిక, మనస్తత్వశాస్త్రాల సమన్వయంపై విశేష కృషి చేసిన ప్రముఖ ఎకనమిస్ట్ రిచర్డ్ థేలర్(72)ను ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుతోపాటు 1.1 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని ఆయన అందుకోనున్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు ఎప్పుడూ పూర్తిగా హేతుబద్ధతపైననే ఆధారపడవని, మానవ సంబంధాల లోతైన ప్రభావం వాటిపై ఎక్కువగానే ఉంటుందని నిర్ధారించేలా ఆయన పరిశోధనలు సాగాయి.
       అమెరికాకు చెందిన రిచర్డ్ థేలర్.. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తనకిష్టమైన ‘బిహేవియరల్ ఎకనమిక్స్’లో ఆయన విసృ్తత పరిశోధనలు చేశారు. ఆ దృగ్విషయాన్ని ప్రతిపాదించిన తొలివ్యక్తిగా నిలిచారు. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు లేదా బృందాలు తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాల్లో వారి మనస్తత్వం, వారికి సంబంధించిన సామాజిక, వ్యక్తిగత అంశాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఎకనమిక్స్, సైకాలజీల మధ్య దూరాన్ని చెరిపేసి, వాటి మధ్య నెలకొన్న సంబంధాన్ని చూపే ప్రయత్నం చేశారు. అందుకే నోబెల్ జ్యూరీ.. ‘వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలు, మనస్తత్వ శాస్త్రాల మధ్య సమన్వయాన్ని సాధించిన తొలి శాస్త్రవేత్త’గా థేలర్‌ను గుర్తించింది. ఆర్థిక శాస్త్రానికి మరింత మానవీయతను సమకూర్చిన వ్యక్తిగా ఆయనను ప్రశంసించింది.
 
నడ్జ్ థీయరీ..
        సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి బిహేవియరల్ ఎకనమిక్స్‌ను సాధనంగా చూపిన థేలర్ సిద్ధాంతం ‘నడ్‌‌జ థీయరీ’గా పాపులర్ అయింది. ‘నడ్‌‌జ’ అనే అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన పుస్తకాన్ని కూడా ఆయన మరొకరితో కలసి రాశారు. థేలర్ ప్రతిపాదించిన మరో సిద్ధాంతం ‘మెంటల్ అకౌంటింగ్’. వినియోగదారులు తమ ఆదాయ, ఖర్చులను మనస్సులోనే లెక్కలేసుకుని, నిర్ణయాలను సులభతరం చేసుకుంటారని వివరించేదే ఆ సిద్ధాంతం. పరిమిత హేతుబద్ధత, స్వీయ నియంత్రణ లేకపోవడం, సామాజిక ప్రాధాన్యతలు.. వ్యక్తుల ఆర్థిక నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాలను ఆయన సమగ్రంగా విశ్లేషించారు.

‘ఐ కెన్’కు నోబెల్ శాంతి పురస్కారం
   అణ్వాయుధాలను నిర్మూలించేందుకు విశేష కృషిచేస్తున్న ‘ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్‌‌స-ఐ కెన్’ (అణ్వాస్త్రాల నిర్మూలనకు అంతర్జాతీయ ఉద్యమం) అనే సంస్థను 1.1 మిలియన్ డాలర్ల విలువైన నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఐ కెన్ అనేది ఒక ఉద్యమ సంస్థ. అంతర్జాతీయంగా అణ్వస్త్ర నిరాయుధీకరణను కోరుకుంటున్న వివిధ దేశాల్లోని వందలాది సంస్థల సమాహారం. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేసే ఐ కెన్...అణ్వాయుధాల నివారణకు ప్రపంచ దేశాలు సహకరించుకోవడంలో చోదక శక్తిగా పనిచేస్తోందని నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్‌వుమన్ బెరిట్ రీస్-అండర్సన్ పేర్కొన్నారు. ఇటీవల ఉత్తర కొరియా వరుసగా అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలు జరుపుతుండటం, ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతి ఐ కెన్‌కు లభించడం గమనార్హం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...