1857 సిపాయిల తిరుగుబాటు - !!! మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం !!!




       1857–-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అనీ, 1857 సిపాయిల తిరుగుబాటు అనీ పరిగణిస్తారు. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లని 'ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకీ బ్రిటీష్ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీసాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్లగల నిర్లక్ష్య వైఖరి మరియూ ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి.






         ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటుకు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని బ్రిటిష్ సామ్రాజ్యాధికారానికి స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ ఈ తిరుగుబాటుకు భారతదేశంలో మెజార్టీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. ప్లాసీ యుద్ధం జరిగి సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి, అణచివేతకు గురైన, అత్యంత ప్రభావితులైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.
        అంతేకాకుండా భారత సైన్యంలో కూడా ఒక వర్గం బ్రిటిష్‌పై వ్యతిరేక భావాన్ని చూపగలిగింది. ఏదేమైనా 1650 తర్వాత భారతదేశంలో పునాదులు పాతుకుపోయి, దేశమంతటా వ్యాపించిన ఈస్టిండియా కంపెనీ అధికార దాహానికి అడ్డుకట్ట వేసి, కంపెనీ పాలనకు స్వస్తి పలికిన చారిత్రక సంఘటన ఇది. 1857 మే 10న మీరట్‌లో మొదలై 1858 సెప్టెంబరు 20న ఢిల్లీలో ముగిసిన తిరుగుబాటుకు అనేక కారణాలు ఉన్నాయి.
       తిరుగుబాటు స్వభావం గురించి చరిత్రకారులు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం దీన్ని 5 విధాలుగా వర్గీకరించొచ్చు. అవి..
1.   సిపాయిల పితూరీ
2.  జాతి సంఘర్షణ
3.  హిందువులు, మహ్మదీయులు కలిపి పన్నిన కుట్ర
4.  ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం
5.  స్వాతంత్య్ర సమరానికి నాందీ (లేదా) మొదటి మెట్టు

తిరుగుబాటుకు కారణాలు
       1857 తిరుగుబాటు వలస పాలనలో అవలంబించిన పద్ధతుల నుంచే ఉద్భవించింది. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ విధానాలు, ఆర్థిక దోపిడి, పరిపాలనా సంస్కరణలు అన్నీ కలసి.. భారతదేశంలోని సంస్థానాలు, సిపాయిలు, జమీందారులు, కర్షకులు, వ్యాపారస్థులు, కళాకారులు, చేతివృత్తులవారు, పండితులు, మిగతా వర్గాల వారికి ఇబ్బందులు కలిగించాయి.
        ఆంగ్ల చరిత్రకారులు భావించినట్లు కేవలం ఆవు, పంది కొవ్వు పూసిన తూటాల కారణంగానే 1857లో తిరుగుబాటు జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. అవి..

  •  డల్హౌసీ విధానాలు (లేదా) రాజకీయ కారణాలు
  •  సాంఘిక కారణాలు
  •  మత సంబంధమైన కారణాలు
  •  ఆర్థిక కారణాలు
  •  సైనిక కారణాలు
  •  తక్షణ కారణం ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలు


       20వ శతాబ్దం ప్రారంభంలో ఈ తిరుగుబాటును V.D. Savarkar. "A planned war of National Independence‘ అని పేర్కొన్నారు. డా॥ఎస్.ఎన్.సేన్ తన గ్రంథం "Eighteen fifty Seven‘లో వి.డి.సావర్కర్ అభిప్రాయాన్ని పాక్షికంగా అంగీకరించారు.1857 తిరుగుబాటు మత పోరాటం అనే వాదనను డా॥ఆర్.డి.మజుందార్ అంగీకరించలేదు.
       1857 తిరుగుబాటు స్వరూపాన్ని T.R. Holnes అనే చరిత్రకారుడు ‘నాగరికత, అనాగరికతల మధ్య జరిగిన సంఘర్షణ’ అని పేర్కొన్నాడు. బ్రిటిషర్లకు నాగరికత ఉందని, భారతీయులకు లేదనే భావం అనేక విమర్శలకు గురైంది.
       ‘హిందువులకు కష్టాలు సృష్టించడానికి మహమ్మదీయుల కుట్ర’ అని ౌఠ్టట్చ, ఖ్చీడౌట లాంటి వాళ్లు అభిప్రాయపడ్డారు.


డల్హౌసీ విధానాలు(లేదా) రాజకీయ కారణాలు
       రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా సతారా, నాగ్‌పూర్, భరత్‌పూర్, ఉదయ్‌పూర్, ఝాన్సీ వంటి హిందూ రాజ్యాలు ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. ఆ విధంగా రాజ్యాలను కోల్పోయిన స్వదేశీ రాజులు తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించారు.

సాంఘిక కారణాలు
       పాశ్చాత్య నాగరికత పట్ల భారతీయులు విముఖత  చూపారు. దాని వ్యాప్తి వల్ల తమ ప్రాచీన సంప్రదాయాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందారు. నరబలి, సతీసహగమనం, బాల్య వివాహాలను ఆంగ్లేయులు రద్దు చేయడం, వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం వంటివన్నీ భారతీయులకు వింతగా, సనాతన ధర్మానికి విరుద్ధంగా తోచాయి.

మత కారణాలు
       హిందువులను క్రైస్తవులుగా మార్చనిదే వారు నాగరికులు కాలేరని, తమకు విశ్వాసపాత్రులై ఉండరని భావించి ఆంగ్లేయులు క్రైస్తవ మత బోధన సాగించారు. విద్యా సంస్థల్లో నిర్బంధ బైబిల్ బోధనను ప్రవేశపెట్టారు. అయితే ఖురాన్, హిందూ మత గ్రంథాల బోధనకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు.

ఆర్థిక కారణాలు
       ఆంగ్లేయులు స్వదేశీ రాజ్యాలను ఆక్రమించడంతో ఆయా రాజ్యాల్లోని ప్రభుత్వోద్యోగులు, సైనికులు నిరుద్యోగులుగా మిగిలారు. ఇంగ్లండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవ ప్రభావం ఫలితంగా భారతదేశంలో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. విదేశీ వస్తువులు చౌకగా లభించడం వల్ల స్వదేశీ పరిశ్రమలపై ఆధారపడిన వారు నిరుద్యోగులయ్యారు. క్షామ కాలంలో ప్రజలకు తగిన రీతిలో సాయం లభించలేదు. ప్రజా సంక్షేమంపై ఆంగ్లేయులు సరైన దృష్టి సారించలేదు.

సైనిక కారణాలు
       ఆంగ్ల సైనికులతో పోల్చితే భారత సిపాయిల జీతభత్యాలు చాలా తక్కువగా ఉండేవి. అర్హత, శక్తి సామర్థ్యాల ప్రాతిపదికన కాకుండా కేవలం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారికి, ఆంగ్లేయుల ఆదరాభిమానాలు చూరగొన్న వారికి మాత్రమే ఉన్నత పదవులు లభించాయి.
 
తక్షణ కారణం
       కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్‌ఫీల్డ్ రైఫిల్స్‌లో ఉపయోగించే తూటాల చుట్టూ ఆవు, పంది కొవ్వు పూస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. ఆవు హిందువులకు పవిత్రం కాగా, పంది మహ్మదీయులకు నిషిద్ధ జంతువు. దాంతో హిందూ, ముస్లిం సిపాయిలు ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటుకు ఉపక్రమించారు.

ఆయా ప్రాంతాల్లో తిరుగుబాటు నాయకులు
కాన్పూర్: ఇక్కడ తిరుగుబాటుకు నానాసాహెబ్ నాయకత్వం వహించాడు. రావుసాహిబ్, తాంతియాతోపే, అజీముల్లాఖాన్ (సలహాదారు) అతడికి మద్దతుగా నిలిచారు. కాన్పూర్‌ను 1857, డిసెంబర్‌లో బ్రిటిష్ సైన్యాధికారి కొలిన్ క్యాంప్‌బెల్ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. నానాసాహెబ్ నేపాల్‌కు పారిపోయాడు. 1859లో ప్రభుత్వం ఇతడిని కాల్చి చంపింది.
 లక్నో: ఇది అవథ్ రాజధాని. 18 నెలల తన కుమారుడి తరఫున తల్లి ‘బేగం హజ్రత్ మహల్’ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఆమె సలహాదారు అహ్మదుల్లా.  కొలిన్ క్యాంప్‌బెల్ 1858, మార్చి 18న లక్నోను స్వాధీనం చేసుకున్నాడు. బేగం హజ్రత్ మహల్ నేపాల్‌కు పారిపోయింది.
 ఝాన్సీ, గ్వాలియర్: లక్ష్మీబాయి ముందుగా ఝాన్సీలో పోరాటం చేసింది. ఝాన్సీని జనరల్ హ్యూరోస్ స్వాధీనం చేసుకున్నాడు. గ్వాలియర్ రాజు సింధియా బ్రిటిష్ పక్షాన నిలిచాడు. కానీ అతని సైనికులు ఝాన్సీ లక్ష్మీబాయిని నాయకత్వం వహించాల్సిందిగా కోరారు. గ్వాలియర్‌లో యుద్ధం చేస్తున్న లక్ష్మీబాయి 1858, జూన్ 17న బ్రిటిష్  జనరల్ హ్యూరోస్ చేతిలో చనిపోయింది. తాంతియాతోపే ఝాన్సీ, గ్వాలియర్ రెండు చోట్ల లక్ష్మీబాయికి మద్దతుగా నిలిచాడు.

 బిహార్: బిహార్‌లోని అర్రా అనే ప్రాంతంలో 70 ఏళ్ల జమీందారు కున్వర్‌సింగ్, అతని సోదరుడు అమర్‌సింగ్‌లు తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.
  రాయ్‌బరేలి: ఖాన్ బహమర్ ఖాన్
ఫైజాబాద్ : మౌలానా అహ్మదుల్లా
 ఢిల్లీ: ఇక్కడ తిరుగుబాటుకు నామమాత్రపు నాయకుడు రెండో బహదూర్‌షా. ఇతను తిరుగుబాటుదారులపై పెద్దగా నమ్మకం చూపకుండా ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాడు. అతని భార్య బేగం హజరత్ మహల్ బ్రిటిష్ వారితో కుమ్మక్కైంది. ఢిల్లీలో తిరుగుబాటుకు నిజమైన నాయకుడు రాయ్‌బరేలీలో సుబేదార్‌గా పనిచేసిన ‘జనరల్ భక్త్‌ఖాన్’.
       ఢిల్లీని ‘జాన్ నికల్సన్’ అనే బ్రిటిష్ సైన్యాధికారి 1857, సెప్టెంబర్‌లో తిరుగుబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. లెఫ్టినెంట్ హడ్సన్ అనే బ్రిటిష్ సైన్యాధికారి రెండో బహదూర్‌షా కుమారుడు ఫకీరుద్దీన్‌తోపాటు అతని కుమారుణ్ని కాల్చి చంపాడు.
       బ్రిటిష్ ప్రభుత్వం రెండో బహదూర్‌షా, అతని భార్య జీనమహల్‌ను దేశాంతర వాస శిక్ష కింద బర్మాలోని రంగూన్‌కి  పంపించింది. వారు అక్కడే మరణించారు.‘జనరల్ భక్త్‌ఖాన్’ అవధ్‌కు వెళ్లి బేగం హజ్రత్ మహల్‌కు అండగా నిలిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయిన అతణ్ని ప్రభుత్వం1859లో పట్టుకుని కాల్చి చంపింది.

       తిరుగుబాటు ప్రారంభం కాకముందే బెంగాల్‌లోని బారక్‌పూర్‌లో ‘మంగళ్ పాండే’ ఎన్‌ఫీల్డ్ తూటాలు ఉపయోగించేందుకు నిరాకరించి, లెఫ్ట్‌నెంట్ బాగ్ అనే అధికారిని 1857, మార్చి 29న కాల్చిచంపాడు. మంగళ్‌పాండేను 1857 సిపాయి తిరుగుబాటు కాలం నాటి తొలి హీరోగా వీడీ సావర్కర్ పేర్కొన్నారు.

తిరుగుబాటు వైఫల్యానికి కారణాలు
       తిరుగుబాటు అకస్మాత్తుగా ప్రారంభమై, ఉద్ధృతంగా కొనసాగి, అతి శీఘ్రంగా వ్యాపించి, విఫలమైంది. ఈ వైఫల్యం వెనుక ఉన్న కారణాలను పరిశీలిద్దాం.
  • కేంద్రీకృత నాయకత్వం, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం తిరుగుబాటుకు ప్రధాన నాయకుడు లేకపోవడం, వివిధ ప్రాంతాలమధ్య నాయకులకు సమన్వయం లేకపోవడంతో తిరుగుబాటు విఫలమైందని చెప్పవచ్చు.  ఉదాహరణకు అయోధ్యలో బేగం హజ్రత్‌మహల్, మౌల్వి అహ్మదుల్లా మధ్య ఘర్షణ వాతావరణం అక్కడ వైఫల్యానికి కారణమయింది.
  • తిరుగుబాటు ఒకేసారి అన్ని ప్రదేశాల్లో జరగలేదు. ఒకే పథకం లేకపోవడం కూడా వైఫల్యానికి ఒక కారణం.
  • దేశవ్యాప్తం కాకపోవడం: తిరుగుబాటు ఉత్తర, మధ్య భారతదేశం దాటిపోలేదు. ఇలా భారతదేశమంతటా జరగకపోవడం వల్ల తిరుగుబాటును అణచివేయడం బ్రిటిషర్లకు సులభమైంది.
  • అన్ని వర్గాలూ పాల్గొనలేదు: స్వదేశీ సంస్థానాధీశుల్లో అందరూ పాల్గొనలేదు. గ్వాలియర్, నైజాం మొదలైన రాజులు బ్రిటిషర్లకు అండగా నిలిచారు. 'తిరుగుబాటు తుపానులో తుడిచిపెట్టుకుపోబోతున్న బ్రిటిష్ పాలనకు స్వదేశీ సంస్థానాధీశులు బలమైన అడ్డుగోడగా నిలిచారు' అని, తిరుగుబాటు సమయంలో ఉన్న వైశ్రాయ్ లార్డ్ కానింగ్ వారిని పొగిడాడు.
  • ఆధునిక విద్యావంతులు తిరుగుబాటును సమర్థించలేదు. వీరు బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం, ఆధునిక రాజకీయ విద్యావిధానాల ద్వారా ఆధునికీకరించి, అభివృద్ధి చేస్తుందని ఆశించారు.
  • వర్తకులు, వడ్డీ వ్యాపారులు బ్రిటిష్‌వారికి మద్దతు పలికారు. బ్రిటిష్ రెవెన్యూ విధానాల ద్వారా లాభపడటం, తిరుగుబాటుదార్ల దాడితో నష్టపోవడంతో వాళ్లు తిరుగుబాటుదార్లకు సహకరించలేదు.
  • సిపాయిల్లో అందరూ పాల్గొనలేదు. సిక్కులు, గూర్ఖాలు బ్రిటిషర్లకు మద్దతు పలికారు.
  • ఆయుధ సంపత్తి, సమర్థులు: అనుభవజ్ఞులైన సైనికాధికారులు, పటిష్ఠమైన సమాచార వ్యవస్థ బ్రిటిషర్ల విజయానికి తోడ్పడ్డాయి. ఇవి భారతీయులకు లేవు.
  • తిరుగుబాటుదార్లే బ్రిటిషర్లకు రహస్య సమాచారం అందించడం: బహదూర్‌షా - II భార్య జీనత్‌మహల్ తిరుగుబాటుదార్లపై నమ్మకం లేక, బ్రిటిషర్ల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు, బ్రిటిషర్లకు తిరుగుబాటుదార్ల సమాచారాన్ని అందించింది.
  • దూరదృష్టి, ఆధునిక దృక్పథాల లోపం: తిరుగుబాటుదార్లలో భవిష్యత్ భారత్‌పట్ల నిర్దిష్ట అభిప్రాయాలు, ప్రణాళికలు మొదలైనవి లేవు. కేవలం తమకు జరిగిన నష్టాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకమయ్యారు. 
            తిరుగుబాటు విఫలమైనా తర్వాత జరిగిన భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ఇది బీజాలు వేసింది.  

తిరుగుబాటు ఫలితాల
        1857 సిపాయిల తిరుగుబాటు ఆధునిక భారతదేశ చరిత్ర గమనంలో ఒక మైలురాయి. అది పాలకులకు, తిరుగుబాటుదార్లకు ఎన్నో హెచ్చరికలు, గుణపాఠాలను అందించింది.
  • బ్రిటిషర్లకు తమ పాలన, కార్యక్రమాలపట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే విషయం అర్థమైంది. సామ్రాజ్య విస్తరణకంటే అంగీకారం పొందే అధికారం ముఖ్యమని గుర్తించారు. బ్రిటిషర్లు తమ మనుగడకు, పాలన సుస్థిరతకు విధేయవర్గం ఆవశ్యకతను గుర్తించారు. దీనికోసం కంపెనీపాలన, బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు, సైనిక వ్యవస్థ మొదలైన ఎన్నో విషయాల్లో మార్పులు తెచ్చారు
  • 1858 భారత ప్రభుత్వ చట్టం: 1858లో బ్రిటిష్ పార్లమెంటు 'యాక్ట్ ఫర్ బెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' అనే చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం ఈస్ట్ఇండియా కంపెనీ పరిపాలన రద్దయింది. భారతదేశ పరిపాలనను బ్రిటిష్ ప్రభుత్వమే ప్రత్యక్షంగా చేపట్టింది. 
  • భారతదేశ పరిపాలనా వ్యవహారాలకోసం 'భారత రాజ్య కార్యదర్శి లేదా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా'ను నియమించారు. ఈయనకు సహాయపడటానికి 15 మంది సభ్యులున్న కౌన్సిల్ ఉంటుంది. ఈయన బ్రిటన్ మంత్రివర్గంలో సభ్యుడు. క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. మొదటి భారత రాజ్యకార్యదర్శి చార్లెస్ ఉడ్స్.
  • గవర్నర్ జనరల్ పదవిని 'గవర్నర్ జనరల్ అండ్ వైశ్రాయ్' గా మార్చారు. బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు గవర్నర్ జనరల్ హోదాలో; స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌముడి ప్రతినిధిగా వైశ్రాయ్ హోదాలో వ్యవహరిస్తాడు. మొదటి వైశ్రాయ్ లార్డ్ కానింగ్.

బ్రిటిష్ ప్రభుత్వ విధానాల్లో మార్పు
  • లార్డ్ కానింగ్ 1858 నవంబర్ ఒకటో తేదీన అలహాబాద్‌లో దర్బార్ ఏర్పాటు చేశాడు. అందులో స్వదేశీ సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపబోమని, వారితో మైత్రీభావం కొనసాగిస్తామనీ చెప్పారు.
  • రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. దీనివల్ల సంస్థాన పాలకులకు దత్తత స్వీకరించే హక్కు కలిగింది.
  • సువిశాల దేశాన్ని పాలించడానికి ప్రజల మద్దతు అవసరమని గుర్తించి, అణచివేత ధోరణికి స్వస్తి చెప్పి, ప్రజాభిప్రాయానికి విలువనివ్వడం ప్రారంభించారు.
  • మతవిషయాల్లో జోక్యం చేసుకోబోమని చెప్పారు. ఏ జాతికి, మతానికి చెందినవారైనా విద్య, ప్రతిభ, నిజాయితీ, సమర్థతలే ప్రభుత్వోద్యోగాలకు అర్హత అని తెలిపారు.
  • రాజకీయ వ్యవస్థలో దేశప్రజలకు భాగస్వామ్యం కల్పించేందుకు 1861 కౌన్సిల్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. 

సైనిక వ్యవస్థలో మార్పులు
        1857 తిరుగుబాటుకు సిపాయిలు ప్రధాన కారణమని గుర్తించిన బ్రిటిష్‌వారు సైనిక వ్యవస్థలో గణనీయ మార్పులు తెచ్చారు.
  • బెంగాల్‌లో సిపాయిలు, సైనికుల నిష్పత్తి 2 : 1 గా, బొంబాయి, మద్రాస్‌లో 3 : 1 గా నిర్ణయించారు. అంతకుముందు ఇది 6 : 1 గా ఉండేది.
  • తిరుగుబాటు సమయంలో తమకు సహకరించిన గూర్ఖాలు, సిక్కులు, రాజపుత్రులను ఎక్కువ సంఖ్యలో చేర్చుకున్నారు.
  • శతఘ్నిదళాన్ని పూర్తిగా ఆంగ్లేయుల అధీనంలోకి తీసుకున్నారు.

విభజించు, పాలించు విధానం
హిందు-ముస్లిం సఖ్యతను తమ మనుగడకు ఆందోళనగా భావించి, విభజించు-పాలించు విధానాన్ని అవలంభించారు. 1857 తిరుగుబాటుకు ముస్లింలు ప్రధాన కారణమని మొదట ముస్లిం వ్యతిరేక విధానాలు, 1875 తరువాత ముస్లింలను దగ్గరికి చేరుస్తూ, హిందువులను దూరంగా ఉంచారు. ఇలా హిందు-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించారు.
1857 తిరుగుబాటు ఒక శకాన్ని ముగించి, మరో వినూత్న శకారంభానికి పునాది వేసింది. సామ్రాజ్య విస్తరణ శకం స్థానంలో ఆర్థిక దోపిడీ శకం ప్రారంభమైంది. 

తిరుగుబాటు స్వభావం: భారతదేశంలో శతాబ్ద కాలంగా వేళ్లూనుకున్న నిరంకుశ బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడేందుకు భారతీయులు చేసిన ప్రథమ తీవ్ర ప్రయత్నమే 1857 తిరుగుబాటు. ఈ తిరుగుబాటుపై చరిత్రకారుల్లో పలురకాల అభిప్రాయాలున్నాయి.

జాన్ లారెన్స్, సీలీ: ''1857 సిపాయిల తిరుగుబాటు 'సిపాయిల పితూరీ' అంతకుమించి ఏమీ కాదు'' అని చెప్పారు. అయితే తిరుగుబాటు సిపాయిల్లో ప్రారంభమైనా, అన్ని వర్గాల ప్రజలూ పాల్గొన్నారు. సిపాయిల్లో కూడా అందరూ పాల్గొనలేదు. కాబట్టి, వారి వాదన సరైంది కాదని అనిపిస్తుంది.

టి.ఆర్.హోమ్స్: 1857 తిరుగుబాటు 'నాగరితకకు అనాగరికతకు మధ్య జరిగిన సంఘర్షణ' అన్నారు. ఈ వివరణలో సంకుచిత జాతిదురహంకారం వ్యక్తమవుతుంది. కారణం, బ్రిటిషర్లు, భారతీయులు ఇరువురూ అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. ఉదాహరణకు ఢిల్లీ, కాన్పూర్, లక్నోల్లో సిపాయిలు అరాచక చర్యలకు పాల్పడితే, బ్రిటిషర్లు ఢిల్లీ, బెనారస్‌లలో కిరాతక చర్యలకు పాల్పడ్డారు. హడ్సన్, నీల్ అవలంబించిన మార్గాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి.

బెంజిమన్ డిజ్‌రేలి: 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా ఈయన అభివర్ణించాడు.
            ఇది కేవలం తూటాలకు కొవ్వు పూయడంవల్ల వచ్చిన క్షణికావేశపు తిరుగుబాటు కాదని వందేళ్లుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణచివేతకు గురైన ప్రజలు సాగించిన పోరాటమని చెప్పారు.

వి.డి.సావార్కర్: స్వాతంత్య్ర సమరయోధుడైన వి.డి.సావార్కర్ సిపాయిల తిరుగుబాటును 'ప్రణాళికాబద్ధమైన ప్రథమ జాతీయ స్వాతంత్య్ర సంగ్రామం' అని వర్ణించాడు. అయితే ఆర్.సి.మజుందార్ అభిప్రాయాల ప్రకారం అది వాస్తవం కాదని తెలుస్తుంది.
  • 1857 తిరుగుబాటుకంటే ముందుగానే 1806లో వేలూరు, 1824లో బారక్‌పూర్‌లో సిపాయిల తిరుగుబాట్లు జరిగాయి.
  • భారతజాతి అంతా తిరుగుబాటులో పాల్గొనలేదు. 
  • స్వాతంత్య్రం కంటే తాము పోగొట్టుకున్న ప్రాంతాలు పొందడానికి తమకు జరిగిన అన్యాయాలను ఎదిరించడానికి తిరుగుబాటు చేశారు.
  • ఈ కారణాలను వివరిస్తూ తిరుగుబాటు ప్రణాళికాబద్ధంగా జరగలేదని మజుందార్ పేర్కొన్నారు.
 ఎస్.ఎన్.సేన్: 1857 తిరుగుబాటు ఒక స్వాతంత్య్ర సమరమని చెప్పారు.
ఎస్.బి.చౌదరి తన 'సివిల్ రెబలియన్ ఇన్ ది ఇండియన్ మ్యుటినీస్' గ్రంథంలో సిపాయిల తిరుగుబాటు సైనిక, పౌర తిరుగుబాట్ల కలయికగా చెప్పారు.ఇలా సిపాయిల తిరుగుబాటుపై పలు అభిప్రాయాలున్నాయి.

తిరుగుబాటుపై ప్రముఖ గ్రంథాలు                            రచయితలు 
ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్                  వి.డి. సావార్కర్
ది సిపాయ్ మ్యుటినీ అండ్ ది రివోల్ట్ ఆఫ్ 1857       ఆర్.సి. మజుందార్
ఎ హిస్టరీ ఆఫ్ ది సిపాయ్ వార్ ఇన్ ఇండియా         జె.డబ్ల్యు.కాయె


ప్రముఖ వ్యక్తులు
బహదూర్‌షా -II: చిట్టచివరి మొగల్ చక్రవర్తి. సిపాయిల తిరుగుబాటులో ఢిల్లీలో నాయకుడు. తిరుగుబాటుదార్లు ఆయనను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అయితే బ్రిటిషర్లు రంగూన్ జైలుకు పంపగా, అక్కడే మరణించాడు.

నానాసాహెబ్: ఈయన అసలు పేరు దొండూపంత్. చివరి పీష్వా బాజీరావు- II కు దత్తపుత్రుడు. కాన్పూర్‌లో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. తరువాత నేపాల్ పారిపోయాడు.

తాంతియా తోపే: ఈయన అసలుపేరు రామ చంద్ర పాండురంగ. గెరిల్లా యుద్ధంలో ఆరితేరినవాడు. నానాసాహెబ్, ఝాన్సీ లక్ష్మీభాయిలకు తిరుగుబాటు సమయంలో తోడ్పాటు అందించాడు. మాన్‌సింగ్ చేసిన ద్రోహం వల్ల బ్రిటిషర్లకు పట్టుబడ్డాడు. బ్రిటిషర్లు ఈయనను ఉరితీశారు.

భక్తఖాన్: మీరట్‌లో తిరుగుబాటుకు నాయకుడు. ఢిల్లీలో తిరుగుబాటుకు వాస్తవ నాయకుడిగా వ్యవహరించాడు. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...