క్యాన్సర్‌పై పోరాటానికి 2018 నోబెల్

2018 నోబెల్‌ వైద్య పురస్కారాన్ని దక్కించుకున్న అమెరికా, జపాన్‌ శాస్త్రవేత్తల ద్వయం
రోగనిరోధక శక్తి నిపుణులను వరించిన అత్యున్నత అవార్డు

         క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అమెరికా పరిశోధకుడు జేమ్స్‌ అలిసన్‌, జపాన్‌ శాస్త్రవేత్త తాసుకు హోంజోలను వైద్య నోబెల్‌ వరించింది. వ్యాధిపై పోరాడేలా రోగనిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడంపై వీరు చేపట్టిన పరిశోధనలకు స్వీడిష్‌ అకాడమీ పట్టంకట్టింది. సంప్రదాయ చికిత్సల్లో నేరుగా క్యాన్సర్‌ కణాలనే వైద్యులు లక్ష్యంగా చేసుకుంటుంటారు. అయితే రోగనిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడం ద్వారా వేగంగా వ్యాధికి కళ్లెం వేయడంపై ఈ ద్వయం దృష్టి కేంద్రీకరించింది. దీంతో శక్తిమంతమైన అధునాతన చికిత్సా విధానాలకు మార్గం సుగమమైంది. ‘‘ఈ విధానం క్యాన్సర్‌ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. వ్యాధిపై పోరాటంలో వైద్యుల ఆలోచనా విధానాన్ని మార్చేసింది’’అని నోబెల్‌ అసెంబ్లీ వ్యాఖ్యానించింది.
 
 

ప్రొటీన్లే లక్ష్యం
          రోగనిరోధక కణాలు కొన్ని ప్రొటీన్లు ఉత్పత్తి చేస్తుంటాయి. ఒక్కోసారి ఇవే రోగనిరోధక వ్యవస్థ చేతిలో క్యాన్సర్‌ కణాలు హతం కాకుండా అడ్డుకుంటాయి. ఈ పరిణామాన్నే ‘బ్రేక్‌’గా పిలుస్తున్నారు. బ్రేక్‌ సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనావేస్తూ.. రోగనిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడంలో అలిసన్‌ విజయం సాధించారు. ఇదే సమయంలో బ్రేక్‌గా పనిచేస్తున్న కొత్త ప్రొటీన్లు లైజండ్‌ పీడీ-1లను హోంజో కనుగొన్నారు. ‘‘క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా రోగనిరోధక శక్తిపై గత వంద ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అలిసన్‌, హోంజోల ముందువరకూ  గుర్తించదగిన పురోగతి కనిపించలేదనే చెప్పాలి’’అని అకాడమీ తెలిపింది. అలిసన్‌ పరిశోధన ఆధారంగా తయారుచేసిన ఔషధానికి ఇప్పటికే అమెరికా ఆహార, ఔషధ పరిపాలన విభాగం పచ్చజెండా ఊపింది. మెలనోమాపై చికిత్సకు వైద్యులు దీన్ని సూచిస్తున్నారు.


2004లోనే ఆసియా నోబెల్‌
         అలిసన్‌.. టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో, హోంజో క్యోటో వర్సిటీలో ప్రొఫెసర్లుగా వ్యవహరిస్తున్నారు. తమ పరిశోధనలకు గాను వీరిద్దరూ 2014లో ‘ఆసియా నోబెల్‌’గా పరిగణించే టాంగ్‌ ప్రైజ్‌ను గెల్చుకున్నారు.

ఊహించనేలేదు: అలిసన్‌
‘‘ఇలాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారం రావడంతో చాలా గర్వంగా అనిపిస్తోంది. నా పరిశోధన ఇంత అద్భుత ఫలితాలను సాధిస్తుందని ఏనాడూ ఊహించలేదు. తాజా విధానంలో చికిత్స పూర్తిచేసుకున్న రోగులను కలుస్తుంటే చాలా భావోద్వేగానికి లోనవుతున్నా. శాస్త్రీయ పరిశోధనల శక్తి, శరీర పనితీరుపై మన అవగాహన, కొత్త విషయాలపై మన తరం అభిలాషకు వీరు నిలువెత్తు సాక్ష్యాలు’’అని అలిసన్‌ వివరించారు. 1995లో టీ-కణాల చర్యలను నియంత్రించే సీటీఎల్‌ఏ-4 గ్రాహకాలను గుర్తించిన ఇద్దరు పరిశోధకుల్లో అలిసన్‌ కూడా ఒకరు. ఒక రకమైన తెల్లరక్త కణాలే ఈ టీ-కణాలు. ఇవి వ్యాధులపై పోరాటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

కృషి కొనసాగిస్తా: హోంజో
మరోవైపు తన కృషిని కొనసాగిస్తానని హోంజో ప్రతినబూనారు. ‘‘నా పరిశోధనను కొనసాగించాలని ఉంది. దీంతో మరింత మంది క్యాన్సర్‌ రోగులను కాపాడొచ్చు’’అని ఆయన విలేకరులతో చెప్పారు. మంగళవారం భౌతికశాస్త్రంలో, బుధవారం రసాయన శాస్త్రంలో, శుక్రవారం శాంతి విభాగంలో, 8న ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాలను ప్రకటిస్తారు. ఈసారి స్వీడిష్‌ అకాడమీ.. సాహిత్య విభాగంలో పురస్కారాన్ని ప్రకటించడంలేదు. 1949 తర్వాత ఇలాంటి పరిణామం జరగడం ఇదే మొదటిసారి. ‘మీటూ కుంభకోణం’, తీవ్రస్థాయి అంతర్గత కుమ్ములాటల కారణంగా అకాడమీ పనితీరు అస్తవ్యస్తమైంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...