అత్యాచారాలకు ఆడువారి బట్టలు కారణమా?

ఆడవాళ్ళు రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తున్నారు. అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది మను మృగాళ్ళ‌ మాట. చిన్నారులనూ చిదిమేస్తున్నారు. ముసలోళ్ళనూ హింసిస్తున్నారు. అంగాలే ఎదగని నెలల పిల్లల గౌన్లు, ముడత శరీరాలను కప్పిన కంపు చీరలు కూడా "మగతనాన్ని" ఆకర్షిస్తాయా? రెచ్చగొడతాయా? ప్రగతిశీలుర‌ ప్రశ్న?      


ఏ దుస్తులు ధరించావు?: అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అమెరికా కాన్సాస్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక సృజనాత్మక పథకం పాటించారు. దీని స్ఫూర్తితో అత్యాచార సమయంలో స్త్రీలు ధరించిన బట్టలతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో 'ఏ దుస్తులు ధరించావు?' అన్న శీర్షికతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇది అత్యాచార బాధితుల‌ భయంకర కన్నీటి గాథలను కథనీకరించింది. మగమత్తులో మనసు మూసుకుపోయినవారి కళ్ళు తెరిపించింది. మహిళల దుస్తులు లైంగిక దాడులను ప్రేరేపిస్తాయన్న ఆలోచనను పటాపంచలు చేసింది. బ్రసెల్స్ లో నివారణ సేవల్లో పనిచేసే మహిళ డెల్ఫైన్ గూసెన్స్ తన, తన తోటి ఉద్యోగుల బట్టలను సేకరించి, తాను పనిచేసే బ్రసెల్స్ జిల్లా మోలెన్ బీక్ మారిటైమ్ కమ్యూనిటి సెంటర్ లో కాన్సాస్ ప్రదర్శనను ప్రతిబింబించే ప్రదర్శనను జనవరి 8 నుండి 20 వరకు ఏర్పాటు చేశారు. ప్రదర్శనలోని 18 రకాల దుస్తుల్లో పైజామాలు, స్నానాల బట్టలు, ట్రాక్ సూట్లు, పాఠశాల యూనిఫాం, పోలీసు వేషధారణ ఉన్నాయి. విజాతి ఆకర్షణలేని స్వజాతి మగదుస్తులే ఎక్కువ‌. ఈ దుస్తులు చూసిన తర్వాతనైనా హింసకు, అత్యాచారాలకు గురైనవారి పట్ల ప్రజల మనస్తత్వం మారుతుందని ఆశిస్తానని, బట్టల ప్రభావమేమీ లేదని, అత్యాచారం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా జరగవచ్చని నిర్ధారణ అయిందని ప్రదర్శన తిలకించిన మహిళ లీస్బెత్ వర్బోవెన్ అన్నారు. అత్యాచార సంస్కృతిపై పురుష సమాజంలో వ్యాపించిన అవాస్తవ‌ ఊహాగాథలకు ప్రతిస్పందనగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశానని గూసెన్స్ చెప్పారు. ఆడపిల్లలకు జాగ్రత్తగా బట్టలేసుకొమ్మని చెపుతాం. మగపిల్లలకు మర్యాదగా మసలుకోమని బోధించం. ఏ బట్టలూ అత్యాచారాలను ఆపవనీ, మహిళలు (మగవారిలాగే) ఇష్టమొచ్చిన దుస్తులు ధరించవచ్చని, తమ దుర్మార్గాలకు మృగవారు బట్టల సాకు చూపవద్దని ఆమె వ్యాఖ్యానించారు.   


ఇది నా తప్పా?: ఇవన్నీ మహిళలందరూ వేసుకునే సాధారణ దుస్తులు. ఐనా లైంగిక దాడులు ఆగలేదు. "ఇది నా తప్పా?" అత్యాచారాలకు గురైన అమాయక స్త్రీలు బాధతో ప్రశ్నిస్తున్నారు. "చిన్ని గౌను కూడా అత్యాచారాన్ని ప్రేరేపించిందా?" బాధితులకు మద్దతు పలికే సామాజిక సేవా సంస్థ 'సిఎడబ్ల్యు' సభ్యురాలు లీస్బెత్ కెన్స్ ప్రశ్నించారు. ఇది మగాళ్ళ సమాజం. స్త్రీలు, పిల్లలు కూడా మగప్రభావాలలో కొట్టుకుపోతున్నారు. ఆడపిల్లలు రెచ్చగొట్టే బట్టలేసుకుంటారని, సరసాలాడుతారని, పొద్దుపోయి సైకిళ్ళలో ఇళ్ళకు చేరుకుంటారని అంటారు. అత్యాచారాలకు, వేధింపులకు ఒకే ఒక వ్యక్తి బాధ్యుడు. అతనే వాటిని ఆపగలడు. అతనే నేరస్తుడు. అని ఆమె వాపోయారు.   


మగవాంఛ ప్రపంచవ్యాపితం: మానభంగాలు ప్రపంచవ్యాపిత సార్వజనిక సమస్య. మానవాళిపై మాయని మచ్చ. 2015 లో యూరోపియన్ యూనియన్ లో 2,15,000 లైంగిక హింసలు నమోదయ్యాయి. అందులో 72 వేలు అత్యాచారాలు. బెల్జియన్ స్త్రీల‌లో 56% మంది లైంగిక హింసకు, 25% మంది బహిరంగ ప్రదేశాల భౌతిక వేధింపులకు గురయ్యారు. "బెల్జియంలో 10% అత్యాచారాలే పోలీసులకు నివేదించబడతాయి. 10% నిందితులే శిక్షించబడతారు. బాధితుల చేదు అనుభవాల వ్యక్తీకరణను సమాజం నిరుత్సాహపరుస్తుంది. జపాన్ లో నిశ్శబ్ద సంస్కృతి వ్యాపించింది. అత్యాచారాలకు గురైన మహిళలెవరూ ఫిర్యాదు చేయరు. చేసినా నేరస్తున్ని నిర్బంధించరు, శిక్షించరు. మానభంగానికి గురైనవారిలో 70% మంది మిత్రులకు, కుటుంబ సభ్యులకు, సమీప ఆప్తులకు చెప్పుకోలేక పోయామన్నారు. 4% కంటే తక్కువ మంది పోలీసుల దగ్గరికెళ్ళారు. "జపాన్ మహిళలు తమపై జరిగిన అత్యాచారాలకు తమనే నిందించుకుంటారు. తామే తప్పు చేశామనుకుంటారు." అని ఓచనోమిజు విశ్వవిద్యాలయ లింగాంశాల అధ్యయన గౌరవాచార్యులు తామీ కైనో బాధపడ్డారు. మాధ్యమాల అభ్యాసిని 28 ఏండ్ల‌ షియోరి ఇటొ పై ప్రసార పాత్రికేయుడు 51 సంవత్సరాల‌ నోరియుకి యమగుచి అత్యాచారం చేశాడు. ఇటొ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యమగుచి టోక్యో ప్రసార వ్యవస్థకు వాషింగ్టన్ బ్యూరో చీఫ్. జపాన్ ప్రధాని షింజో అబె జీవిత చరిత్ర రాశారు. విచారణ, దర్యాప్తు అధికారులు యమగుచి పై కేసు ఎత్తేశారు. 2017 డిసెంబర్ లో యొకొహామా లో ఆరుగురు విశ్వవిద్యాలయ విద్యార్థులు సహ విద్యార్థినిని బలవంతంగా మద్యం తాపి సామూహిక అత్యాచారం చేశారు. విచారణాధికారులు కేసు వదిలేశారు. జపాన్ లో అత్యాచారుల దోష నిర్ధారణ జరిగినా శిక్షలు పడవు. నేరస్తులు జైలుకు పోరు. జనవరిలో టోక్యో దగ్గరి చిబా విశ్వవిద్యాలయంలో ఇద్దరు విద్యార్థులు తోటి విద్యార్థినిని మద్యం తాపి అత్యాచారం చేశారు. టోక్యో యూనివర్సిటీలో ఇంకొక విద్యార్థి సహ విద్యార్థినిని మానభంగం చేశాడు. వీరి నేరాలు రుజువైనా శిక్షలు రద్దయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ లో ఆడువారిపై అత్యాచారాలు పెరిగాయని ప్రధాని అబె అన్నారు. 2014 లో జపాన్ లో 15 మందిలో ఒక మహిళ, అమెరికాలో 5 మందిలో ఒకరు అత్యాచారానికి గురయ్యామని ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ సర్వేలలో తేలింది. అమెరికాలో 33% మహిళలు తమపై జరిగిన అత్యాచారాలను పోలీసులకు తెలిపారు. మా దేశంలో లైంగిక దాడులు తులనాత్మకంగా తక్కువని జపాన్ ప్రభుత్వం గొప్పలు పోతుంది. దక్షిణ నైజీరియా లో ఒక దరిద్రపు ఆచారముంది. భర్త చనిపోతే భార్య ను శుద్ధి ప్రక్రియకు గురిచేస్తారు. భర్త శవంలో శరీర భాగాలను కడిగిన నీటిని భార్య తాగాలి. ఆ తర్వాత 7 రోజులు తిండి లేకుండా గదిలో బంధిస్తారు. ఆమె బతికితే అతని చావుకు ఆమె కారణం కాదని, మరణిస్తే భర్త అదృశ్య శక్తులు ఆమెను చంపేశాయని నిర్ణయిస్తారు.


మన రాజకీయులు, చట్టనిర్మాతలు, మనువాదులు, మతాధిపతులు ఆడువారు అత్యాచారాలకు లోనయినప్పుడు మొద్దుగా బుద్ధులు మరిచి మాట్లాడుతుంటారు. నిర్భయ అఘాయిత్య సందర్భంలో హిందూ గురు ఆశారాం బాపు, సంఘ్ ప్రముఖుడు మోహన్ భాగవత్, మధ్య ప్రదేశ్ భాజపా మంత్రి కైలాస్ విజయవర్గీయ, మహిళా శాస్త్రవేత్త డా. అనితా శుక్లా, బి.ఎస్.పి. ఎం.పి. షఫీక్ రహ్మాన్ బర్ఖ్, తృణాముల్ ఎం.పి. కాకోలి ఘోశ్ దస్తీదార్, జమాత్ ఇ ఇస్లాం మతసంస్థ పెద్దలు అమానవీయంగా వ్యాఖ్యానించారు. "భర్తలు, తండ్రులు లేకుండా సూర్యాస్తమయం తర్వాత బయటికి పోయే ఆడువారు గౌరవార్హులు కారు. పెట్రోలు మంటకు కారణమవుతుంది. చక్కెర చీమలను ఆకర్షిస్తుంది." సమాజ్ వాదీ పార్టీ నేత అబు అజ్మీ గతేడాది సూత్రీకరించారు. 2014 లో మహారాష్ట్ర మహిళా హక్కుల సంఘం సభ్యురాలు, రాజకీయురాలు ఆశా మిర్గే అత్యాచారాలకు ఆడువారి బట్టలే కారణమని నిందించారు. నిర్భయ రాత్రి సినిమాకెందుకెళ్ళాలి? ముంబయి శక్తి మిల్స్ సామూహిక అత్యాచారానికి గురైన మహిళ అక్కడికెందుకెళ్ళింది? అని ప్రశ్నిస్తూ ఆడువారి బట్టలు, ప్రవర్తన, వారు తగని స్థలాలకు పోవడమే అత్యాచారాలకు కారణమని తీర్మానించారు.


వనితా వలువలు కాదు మగ మనసులు మారాలి: "ఆడువారిని లైంగికదృష్టితోనే చూడరాదు. మానవులుగా పరిగణించాలి. వారు శారీరక వాంఛలు తీర్చే వస్తువులు కాదు. మగాళ్ళ చేతి కీలుబొమ్మలు కాదు." అని సంప్రదాయ ముస్లిం దేశం నైజీరియా రచయిత అబూబకర్ ఆదాం ఇబ్రహీం అన్నారు. "మానభంగాలకు స్త్రీల దుస్తులే కారణమని చాలాకాలంగా సాకులు చెపుతున్నారు. ఇది తమ నియంత్రణాశూన్యతను, పశుశక్తి ప్రయోగాన్ని కప్పిపుచ్చుకోడానికి నేరస్తులు చేసే అపనింద. బాధ్యతను బాధితులపై నెట్టే బాధ్యతారాహిత్యం." మానసికశాస్త్రజ్ఞులు, మానభంగాలు, లైంగిక వేధింపుల అధ్యయన నిపుణులు సంద్ర శుల్మన్ విశదీకరించారు. అత్యాచార మగాళ్ళు రొమ్ములిరుసుకొని తిరుగుతారు. దాడులకు గురైన స్త్రీలు, వారి పిల్లలు శారీరక‌, సామాజిక, సమస్యలకు, బాధలకు గురవుతారు. మగాళ్ళు మహిళలను అణగదొక్కడంలో చూపించే అతితెలువులను వనితా వికాసానికి ఉపయోగిస్తే ప్రపంచం మరో విధంగా ఉండేది. ఆడువారి బట్టలు వాంఛను రెచ్చగొట్టవు. మగబుద్ధి మారాలి. అమ్మా, చెల్లీ ఆడువారేనని, స్త్రీలు సమాజనిర్మాతలని, తోటి మానవులని గుర్తించాలి.   





03.02.2018 నాటి 'విశాలాంధ్ర' లో అసలు శీర్షికతో, "లైంగికదాడులకు ఆడవారి బట్టలు కారణమా?" అన్న శీర్షికతో 08.02.2018 నాటి 'నవ తెలంగాణ' లోనూ ప్రచురించబడింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...